Post date: Mar 22, 2012 8:43:2 AM
కోవూరు ఉప ఎన్నికల్లో గెలుపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్దేనని ఆ పార్టీ తరఫున విజయఢంకా మోగించిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ మండలం వెంకటేశ్వరపురంలోని పాలిటెక్నిక్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో కలెక్టర్ బి.శ్రీధర్ నుంచి ఆయన ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను ఓడించాలని కాంగ్రెస్, టీడీపీ రకరకాలుగా ఓటర్లను ప్రలోభపెట్టాయన్నారు. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా నీతికి, నిజాయతీకి ఓటేసి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ను ఆశీర్వదించారని చెప్పారు. పత్రికలన్నా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నా తాను గౌరవిస్తానని.. కానీ ఓపత్రిక తనపై పనికట్టుకుని బురదచల్లేందుకు ప్రయత్నించిందని తెలిపారు.
తాను ప్రచారానికి వెళ్తే నిలదీస్తున్నారంటూ అసత్య కథనాలను ప్రచురించారన్నారు. జగన్ నాయకత్వంలో ప్రజలు తనను ఆశీర్వదించి దివంగత వైఎస్ సేవలకు గుర్తింపుగా విజయాన్నిచ్చారన్నారు. కోవూరు ఉప ఎన్నికల ఫలితం రాబోయే 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయానికి సూచికగా అభివర్ణించారు. నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి రాజకీయ వారుసుడెవరో ఈ ఉప ఎన్నికలతో ప్రజలే తేల్చిచెప్పారని వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్రెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎల్లసిరి గోపాల్రెడ్డిలతో కలిసి విజయోత్సవాల్లో పాల్గొన్నారు.