Joseph Prestly,జోసెఫ్ ప్రీస్ట్‌లీ

---(మార్చి 13, 1733—ఫిబ్రవరి 6, 1804) ప్రాణవాయువుని అందించిన వాడు! ఏడాదికల్లా తల్లిని కోల్పోయాడు... ఏడేళ్లకల్లా తండ్రికీ దూరమయ్యాడు... మేనత్త దగ్గర పెరిగాడు.. భాషలెన్నో చదివాడు... శాస్త్రవేత్తగా ఎదిగాడు! ఆయనే జోసెఫ్‌ ప్రీస్‌ట్లీ.. పుట్టినది ఈరోజే! 13/03/1733.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రిల్లో ఆక్సిజన్‌ను అందించడం వల్ల ఎందరో రోగుల ప్రాణాలు నిలబడుతున్నాయి. ఆ ప్రాణవాయువును మనకి అందించిన మహనీయుడే జోసెఫ్‌ ప్రీస్‌ట్లీ. వాతావరణంలో సహజంగా కొద్దిగా మాత్రమే లభించే ఆక్సిజన్‌ను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నది ఈయనే.మండే ఎండలో సోడా, కోక్‌లు తాగుతున్నా, ఐస్‌క్రీమ్‌ తింటున్నా కూడా ఈయన్నే తల్చుకోవాలి. ఎందుకంటే వాటి తయారీలో ప్రధాన పాత్ర వహించే కార్బన్‌డయాక్సైడును కృత్రిమంగా చేయడాన్ని కనిపెట్టింది కూడా ఈయనే. ఇవే కాదు కార్బన్‌ మోనాక్సైడు, నైట్రస్‌ ఆక్సైడు (లాఫింగ్‌ గ్యాస్‌) లను కూడా ఈయనే ఆవిష్కరించారు. ఇవన్నీ వేర్వేరు సందర్భాలలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.ఇంగ్లండ్‌లోని లీడ్స్‌ నగరానికి దగ్గర్లోని ఓ గ్రామంలో 1733 మార్చి 13న పుట్టిన జోసెఫ్‌ ప్రీస్‌ట్లీ ఏడాదికే తల్లిని, ఏడేళ్లకల్లా తండ్రిని కోల్పోయి అనాథయ్యాడు. మేనత్త దగ్గర పెరుగుతూ ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, జర్మన్‌, అరబిక్‌ భాషలపై పట్టు సాధించాడు. పట్టభద్రుడయ్యాక చర్చిలో పాస్టర్‌గా చేరాడు. ఆదాయం చాలక ఓవైపు ట్యూషన్లు చెబుతూనే ఇంగ్లిషు గ్రామర్‌పై పుస్తకం రాశాడు. ఫలితంగా ఒక అకాడమీలో టీచర్‌గా అవకాశం వచ్చింది. అక్కడే రసాయన శాస్త్రంపై మక్కువ పెరిగి ప్రయోగాలు చేయసాగాడు.

ప్రఖ్యాత శాస్త్రవేత్త బెంజిమెన్‌ ఫ్రాంక్లిన్‌ ఇంగ్లండు పర్యటనతో స్ఫూర్తి పొంది విద్యుత్‌పై అధ్యయనం చేసి 'హిస్టరీ అండ్‌ ప్రెజెంట్‌ స్టేట్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ' గ్రంథాన్ని రాయడం విశేషం. ఇందుకు గుర్తింపుగా రాయల్‌ సొసైటీ ఫెలోగా ఎంపికయ్యారు. జీవితకాలంలో ఆయన మొత్తం 150 పుస్తకాలు రాశారు. మరోవైపు రాజకీయాలపై ముఖ్యంగా ఫ్రెంచి విప్లవంపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆయన భావాలతో ఏకీభవించని ప్రత్యర్థులు ఆయన ప్రయోగశాలపై చేసిన దాడి వల్ల 20 ఏళ్ల పరిశోధన పత్రాలు దగ్ధమయ్యాయి. దాంతో అమెరికా వలస వెళ్లి అక్కడే వాయువులపై పరిశోధనలు చేశాడు. అమెరికా నార్తంబర్‌లాండ్‌లో ఆయన ప్రయోగశాలను నేషనల్‌ మ్యూజియంగా ప్రకటించారు.