Johannes Kepler-జొహెనెస్ కెప్లర్

Johannes Kepler-జొహెనెస్ కెప్లర్

జొహెనెస్ కెప్లర్, 1571లో డిసెంబరు 27న జర్మనీలోని వేల్‌డెర్ స్టాట్‌లో జన్మించారు. కేథరిన్, హెన్రిక్ కెప్లర్ ఆయన తల్లిదండ్రులు. గ్రామర్ పాఠశాల, లేటిన్ పాఠశాల, మాల్‌బ్రాన్‌లోని మతబోధకుల పాఠశాలలో విద్య అభ్యసించారు. ఆయన 1589లో టుబిన్‌జెన్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం, మతశాస్త్రం నేర్చుకునేందుకు చేరారు. అక్కడ ఆయన గణితశాస్త్రంలో ప్రతిభావంతుడిగా గుర్తింపు సాధించారు. ఆస్ట్రియా గ్రాజ్‌లోని ప్రొటెస్టెంట్ పాఠశాలలో గణితం, ఖగోళశాస్త్రాల ఉపాధ్యాయుడిగా చేరారు. తర్వాత టుబిన్‌జెన్ విశ్వవిద్యాలయంలో బోధకుడిగా పనిచేశారు. ఖగోళ, జ్యోతిష, గణిత, తత్వ శాస్త్రాలపై అధ్యయనం చేశారు. గ్రహాల కొత్త కక్ష్యల గురించి అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త టైకోబ్రా కెప్లర్‌ని తన సహాయకుడిగా నియమించుకున్నాడు. టైకోబ్రా మరణాంతరం ఇంపీరియల్ గణిత శాస్త్రవేత్తగా కెప్లర్ పదవిని పొందారు. గణన చేయడానికి వర్గమానాలను ఏవిధంగా ఉపయోగించవచ్చో వివరించారు. గ్రహగతులకు సంబంధించి మూడు నియమాలు ప్రతిపాదించారు. కోపర్నికస్ తెలియజేసిన విషయాలను మెరుగుపరిచి వాటిని అభివృద్ధి చేశారు. కెప్లర్ గతి నియమాలు, న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఉపయోగపడ్డాయి. 1630లో నవంబరు 15న తన 58వ ఏట జర్మనీలోని రెజెన్స్‌బెర్గ్‌లో మరణించారు.స్మృతి చిహ్నాలు: చెక్ రిపబ్లిక్ ప్రేగ్‌లో టైకోబ్రా, కెప్లర్ శిలావిగ్రహాలు ప్రతిష్ఠించారు. 2002లో కెప్లర్ చిత్రం ఉన్న 10 యూరోల వెండి నాణెం విడుదల చేసారు. జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆయన చిత్రాన్ని కలిగి ఉన్న తపాలా బిళ్ల విడుదలజేసింది.