సర్ ఐజాక్ న్యూటన్ - ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఒక సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలొ అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం మరియు అది సైన్సు గా ఎలా పరిణామం చెందింది? అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవస్తుంది. 1687 లో ప్రచురితమైన ఆయన శాస్త్ర గ్రంథం en:Philosophiæ Naturalis Principia Mathematica, సైన్సు చరిత్రలో అత్యంత ముఖ్యమైన రచన. ఈ గ్రంథంలో గురుత్వాకర్షణ శక్తి గురించి, న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన నియమాల గురించి ప్రస్థావించాడు. తరువాతి మూడు శతాబ్దాల పాటు భౌతిక ప్రపంచానికి సైన్సు దృక్కోణంగా వెలుగొందిన యాంత్రిక శాస్త్రానికి తరువాత ఆధునిక ఇంజనీరింగ్ కూ ఈ గ్రంథమే పునాది. ఏదైనా ఒక వస్తువు యొక్క గమనం, భూమి మీదైనా లేక ఇతర గ్రహాలమీదైనా ఒకే రకమైన నియమాల మీద ఆధారపడి ఉంటుందని నిరూపించాడు. దీనికి ఆధారంగా కెప్లర్ నియమాలకూ మరియు గురుత్వాకర్షణ సిద్ధాంతాలకూ గల సామ్యాన్ని దృష్టాంతంగా చూపాడు. దీంతో సూర్య కేంద్రక సిద్ధాంతంపై పూర్తిగా అనుమానం తొలిగిపోవడమే కాకుండా ఆధునిక సైన్సు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది.'ఎంత చిన్నగా ఉన్నాడో.. వీణ్ని ఒక చిన్న బుడ్డి చెంబులో పెట్టొచ్చు'అంది తల్లి తన కొడుకుని చూసి. నెలలు నిండకుండానే పుట్టిన ఆ పిల్లాడే, పెరిగి పెద్దయి ప్రపంచంలోనే మేటి శాస్త్రవేత్తల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. అతడే సర్ ఐజాక్ న్యూటన్. ఈనాడు మనం రాకెట్లలో అంతరిక్షంలోకి దూసుకుపోతున్నామంటే, అందుకు న్యూటన్ సిద్ధాంతాలే కారణం. విశ్వ రహస్యాలను విశ్లేషించి మానవాళికి వివరించాడు.ఇంగ్లండ్ దగ్గరి ఉల్తోప్ గ్రామంలో 367 ఏళ్ల క్రితం 1642 డిసెంబర్ 25న ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు న్యూటన్. పుట్టడానికి మూడు నెలల ముందే నాన్న చనిపోయాడు. మూడేళ్ల వయసులో అమ్మ వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అమ్మమ్మ దగ్గర పెరిగిన న్యూటన్ 1661లో ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరాడు. గణిత, భౌతిక, ఖగోళ శాస్త్ర పరిశోధనలపై మక్కువ పెంచుకున్నాడు. అక్కడే ప్రొఫెసర్గా నియమితుడైన న్యూటన్, 1667లో పరావర్తన దూరదర్శినిని నిర్మించి సంచలనం సృష్టించాడు. చిన్నతనంలో చెట్టు నుంచి రాలిన యాపిల్ను గమనించిన న్యూటన్ అందుకు కారణాన్ని అన్వేషించే క్రమంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. భూమి, చంద్రుడు, గ్రహాలు, సూర్యుడు సహా విశ్వంలోని వస్తువులపై గురుత్వ శక్తి ఎలా పని చేస్తుందో వివరిస్తూ విశ్వ గురుత్వ నియమాన్ని ప్రతిపాదించాడు. గమన సూత్రాలను నిర్వచించాడు. భౌతిక శాస్త్ర భావనలను వివరిస్తూ 'ప్రిన్సిపియా మేథమేటికా' గ్రంథాన్ని రచించాడు. కాంతిపై న్యూటన్ చేసిన పరిశోధనల ఫలితంగా 'దృశాశాస్త్రం' (optics) పుట్టింది.
ఆయనకు 1672లో రాయల్ సొసైటీ ఫెలోషిప్ లభించింది. అప్పటి వరకూ ప్రకృతి శాస్త్రంలో ఒక భాగంగా ఉన్న భౌతిక శాస్త్రాన్ని న్యూటన్ ఆవిష్కరణలు, సిద్ధాంతాల వల్ల ప్రత్యేక శాస్త్రంగా గుర్తించారు. అందుకే న్యూటన్ను భౌతిక శాస్త్ర పితామహుడు అంటారు. 1705లో బ్రిటిష్ ప్రభుత్వం 'సర్' అని బిరుదు నిచ్చి సత్కరించింది. మార్చి 31, 1727 లో న్యూటన్ చనిపోయాడు.
''న్యూటన్కు ప్రకృతి తెరిచిన గ్రంథం. అందులోని అక్షరాలను ఆయన సునాయాసంగా చదువగలడు.
ప్రయోగకర్త, సైద్ధాంతికుడు, యంత్ర కారుడు, కళాకారుడు కలిస్తేనే ఐజాక్ న్యూటన్ ''