J.J.Thomson

మీరు చూస్తున్న టీవీ, వాడుతున్న కంప్యూటర్‌, మాట్లాడుతున్న సెల్‌ఫోన్‌.. వీటన్నింటికీ మూలమైన శాస్త్రానికి ఎవరి వల్ల నాంది ఏర్పడిందో తెలుసా? జేజే థామ్సన్‌ అనే బ్రిటిష్‌ శాస్త్రవేత్త వల్ల. మనకిప్పుడు ఎలక్ట్రాన్‌ అంటే తెలుసు. ఆ ఎలక్ట్రాన్‌ని కనుక్కున్న వ్యక్తి ఈయనే. ఎలక్ట్రాన్‌ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన విప్లవాన్ని తీసుకొచ్చింది. 'ఎలక్ట్రానిక్స్‌' అనే శాస్త్రాన్ని మన ముందుకు తెచ్చింది. ఇతని పూర్తి పేరు సర్‌ జోసెఫ్‌ జాన్‌ థామ్సన్‌. విజ్ఞానశాస్త్రంలో అత్యున్నతమైన 'నోబెల్‌'ను తాను అందుకోవడమే కాకుండా, తన మార్గదర్శకత్వంలో కుమారుడికి, మరో ఎనిమిది మంది శాస్త్రవేత్తలకు నోబెల్‌ లభించేలా చేసిన ఘనత ఈయనదే.థామ్సన్‌ 1856లో డిసెంబర్‌ 18న ఇంగ్లాండులోని మాంచెస్టర్‌లో పుట్టాడు. నాన్న పాత గ్రంథాల వ్యాపారి అవడంతో చిన్నప్పటి నుంచే దొరికిన పుస్తకమల్లా చదివేవాడు. తండ్రి కోరికపై ఇంజనీరింగ్‌ కళాశాలలో చేరాడు. పదహారేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయినా స్కాలర్‌షిప్‌లతో దాన్ని పూర్తిచేశాడు. ఆపై భౌతిక శాస్త్రంపై ఇష్టం పెంచుకున్నాడు. పరిశోధనలే ధ్యేయంగా లండన్‌లోని కేవిండిష్‌ లాబోరేటరీలో పరిశోధకునిగా చేరాడు. చేరిన కొన్నాళ్లకే ఆ సంస్థ హెడ్‌గా మారాడు. అప్పటికి అతడి వయస్సు కేవలం 24 ఏళ్లు. ఆ పదవిలో 34 ఏళ్ల పాటు కొనసాగాడు.

పదార్థంలో పరమాణువే విభజించలేని కణమని భావించే ఆ కాలంలో పరమాణువులో ఎలక్ట్రాన్‌ అనే కణం ఉంటుందని చెప్పి సంచలనం సృష్టించాడు. క్రీస్తుకు పూర్వమే గ్రీకు శాస్త్రవేత్తలు విద్యుచ్ఛక్తిని ఊహించి రుణావేశం, ధనావేశం అనే రెండు విద్యుదావేశాలు ఉంటాయని చెప్పారు. అంతకు మించి దాని గురించి ఎవరికీ తెలియదు. 19వ శతాబ్దంలో విలియమ్‌ క్రూక్‌ అనే శాస్త్రజ్ఞుడు కేథోడ్‌ కిరణాలను కనుక్కున్నాడు. ఆ కేథోడ్‌ కిరణాలకు విద్యుత్‌, అయస్కాంత క్షేత్రాలను అన్వయించి ఆ కిరణాలు రుణావేశముండే అతి తేలికైన కణాల ప్రవాహమని థామ్సన్‌ నిర్థ్ధారించాడు. విశ్వంలోని ద్రవ్యంలో రుణ విద్యుదావేశముండే అతి తేలికైన ప్రాథమిక కణం అదేనని ప్రకటించి థామ్సన్‌ దానికి ఎలక్ట్రాన్‌ అని పేరు పెట్టాడు. ఎలక్ట్రాన్‌ను కనుగొన్నందుకు 1906లో థామ్సన్‌కు నోబెల్‌ వచ్చింది. థామ్సన్‌ కుమారుడు జె.పి.థామ్సన్‌ ఎలక్ట్రాన్‌కి తరంగ స్వభావాన్ని ఆపాదించి, 1937లో నోబెల్‌ అందుకున్నాడు.