Abdul Kalam , అబ్దుల్ కలామ్
మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా... పీపుల్స్ ప్రెసిడెంట్... ఈ పేర్లను ఎవరిని ఉద్దేశించి చెబుతారో తెలుసా? డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం గురించే! దేశ అత్యున్నత పీఠమైన రాష్ట్రపతి పదవిని అలంకరించడమే కాదు, దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను కూడా పొందిన గొప్ప శాస్త్రవేత్త ఆయన. భారతదేశం అమ్ములపొదిలో అగ్ని, పృథ్వి, ఆకాశ్, త్రిశూల్, నాగ క్షిపణులు చేరడం వెనుక ఆయన పాత్ర మరువలేనిది. దేశ పటిష్ఠతకు దోహదపడుతూనే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరికీ అందుబాటులో ఉంటూ 'ప్రజల రాష్ట్రపతి'గా కలాం మన్ననలు పొందారు.
రామేశ్వరంలో ఓ పేద ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15న పుట్టిన అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం కష్టపడి పైకెదికిన వ్యక్తి. తండ్రి ఒక దశలో పడవ నడిపేవాడు. పాత ఇంట్లో ఎక్కువ మంది సభ్యులున్న కుటుంబంలో ఒకడైన కలాం, బడిలో చదువుకునే రోజుల్లో మేనమామతో కలిసి దినపత్రికలు పంచడం, చింతపిక్కలు ఏరి అమ్మడం లాంటి పనులు చేసేవాడు. గాలి పటాలు ఎగరేసినా, ఎగిరే పక్షుల్ని చూసినా చిన్నారి కలాం ఆకాశంలో విహరించాలని కలలు కనేవాడు. ఓసారి ఉపాధ్యాయుడితో ఆ సంగతే చెబితే ఆయన 'నువ్వు ఏం కావాలనుకున్నా అవగలవు. కలలు కని, అందుకు తగిన కృషి చెయ్యి' అన్నారు. ఆ మాటలు కలాం మనసులో నాటుకుపోయాయి.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కలాం చదువును నిర్లక్ష్యం చేయకుండా మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆపై డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్), ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)లలో పనిచేశారు. శత్రు లక్ష్యాలను ఛేదించే అగ్ని, పృథ్వి క్షిపణులకు ప్రత్యక్షంగా రూపకల్పన చేశారు. తొలి దేశీయ ఉపగ్రహ ప్రయోగ నౌక (ఎస్ఎల్వీత్రీ) రూపకల్పనలో పాల్గొన్నారు. దేశం విజయవంతంగా నిర్వర్తించిన అణుబాంబు పరీక్షలో కీలక పాత్ర వహించారు. అంచెలంచెలుగా భారత రక్షణ శాఖకు సలహాలందించే శాస్త్రవేత్తగా ఎదిగారు. ఆయన కృషికి గుర్తింపుగా పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారత రత్న పురస్కారాలు లభించాయి. దేశవిదేశాల్లోని 30 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లతో పాటు అంతర్జాతీయ అవార్డులు పొందారు. మన దేశపు ప్రతిష్ఠాత్మక అంతరిక్ష కార్యక్రమం చంద్రయాన్కి సలహా సహకారాలు అందించారు. పోలియో బాధితుల కోసం తేలికైన కాలిపర్ తయారీలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేశారు.
జీవితానుభవాలతో ఆయన రాసిన 'వింగ్స్ ఆఫ్ ఫైర్', 'ఇగ్నైటెడ్ మైండ్స్', 'ఇండియా2020', 'మై జర్నీ' పుస్తకాలు తప్పక చదవవలసినవి.
పేద కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు చిన్నప్పుడు చింతపిక్కలు ఏరి అమ్మాడు... పేపర్లు పంచాడు... అయినా చదువును వదల్లేదు... ఆ చదువే అతడికి సోపానమైంది... పెరిగి పెద్దయి దేశంలోనే అత్యున్నత పదవిని అందుకున్నాడు! ఎందరికో స్ఫూర్తిని పంచాడు! ఆయనే శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్! పుట్టిన రోజు ఇవాళే- 1931 అక్టోబర్ 15న.
డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం- Dr.A.P.J. Abdul Kalam.