Jayanth Vishnu Narlikar-జయంత్ విష్ను నార్లికర్
గ్రహాంతర జీవులపై గట్టి నమ్మకం! జీవం భూమికి మాత్రమే పరిమితం కాదనేది ఆయన సిద్ధాంతం. అందుకు సాక్ష్యం కూడా లభించడం విశేషం. ఆయనెవరో కాదు, మన భారతీయ శాస్త్రవేత్తే. ఇవాళే పుట్టినరోజు!--19-july-1938ఈ విశ్వంలో భూమిపై తప్ప మరెక్కడా జీవులు లేవా? అనే ప్రశ్న అందరినీ వేధిస్తున్నదే. ఈ అంశంపై సాధికారికమైన పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తల్లో మన దేశానికి చెందిన జయంత్ విష్ణు నార్లికర్ ఒకరు. మన దేశపు ఉన్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్ అందుకున్న ఈయన అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఖగోళ శాస్త్రవేత్త. ఈయన ఆధ్వర్యంలో మన హైదరాబాద్లో జరిగిన పరిశోధనలో గ్రహాంతరాలకు చెందిన సూక్ష్మజీవులను కనుగొనడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 1938 జులై 19న పుట్టిన జయంత్ నార్లికర్ చిన్నతనం నుంచే చురుకైన విద్యార్థిగా గుర్తింపు పొందారు. తండ్రి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్. తల్లి సంస్కృత పండితురాలు. బెనారస్ విశ్వవిద్యాలయంలోనే బీఎస్సీ డిగ్రీ అందుకున్న జయంత్, కేంబ్రిడ్జి యూనివర్శిటీ నుంచి గణితంలో ఎంఏ చేశారు. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్హొయల్ పర్యవేక్షణలో పీహెచ్డీ సాధించారు. సైద్ధాంతిక భౌతిక (Theorigtical Physics), ఖగోళ (Astronomy), విశ్వసృష్టి (Cosmology) శాస్త్రాలకు ఎనలేని సేవలందించారు. మొదట్లో కేంబ్రిడ్జిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియరిటికల్ అస్ట్రానమీలో అధ్యాపకునిగా పనిచేస్తూ తన సిద్ధాంతాలతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినా, స్వదేశంపై అభిమానంతో తిరిగి వచ్చి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR)లో ప్రొఫెసర్గా (1972-88) పనిచేశారు. ఆపై పుణెలోని ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ అస్ట్రానమీ అండ్ అస్ట్రోఫిజిక్స్కు వ్యవస్థాపక డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం రిటైరయినా అక్కడే ఎమిరిటస్ ప్రొఫెసర్ హోదాలో పరిశోధనలు కొనసాగిస్తున్నారు.గ్రహాంతరాల్లో జీవం ఉందనే ఆయన వాదనకు 2001 జనవరిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) హైదరాబాద్లో జరిపిన ప్రయోగం బలం చేకూర్చింది. ఓ భారీ బెలూన్కు అనుసంధానించిన పేలోడ్ను భూమి ఉపరితలం నుంచి 41 కిలోమీటర్ల ఎత్తులోని వాతావరణంలోకి ప్రయోగించి అక్కడ సూక్ష్మజీవుల ఉనికిని గుర్తించారు. భూమి నుంచి సూక్ష్మజీవులు ఇంత ఎత్తుకు వెళ్లలేవు కాబట్టి, ఇవి భూమికి సంబంధించినవి కావు. ఇతర గ్రహాలకు సంబంధించిన జీవులే అక్కడి వాతావరణంలో ఉన్నాయని నార్లికర్ అంచనా వేశారు. ప్రాణికోటి అవతరణలో గొప్ప మలుపు తెచ్చిన ఈ ప్రయోగం అంగారుకుడిపై జరుపుతున్న ప్రయోగాలకు నాంది పలికింది.
నార్లికర్ జరిపిన ప్రయోగంలో కనుగొన్న సూక్ష్మజీవులో ఒక జాతికి తన గురువైన ఫ్రెడ్హోయల్ పేరిట 'జనీబేక్టర్ హొయ్లీ' అని, మరో జాతికి ఇస్రో పేరిట 'బేసిల్లెస్ ఇస్రోనెన్సిస్' అని, మూడో జాతికి 'బేసిల్లస్ ఆర్యభట్ట' అని పేరు పెట్టారు.
సైన్స్ను సామాన్యుడికి చేరువ చేసేందుకు కృషి చేస్తున్న ఆయన ఇంగ్లిషు, మరాఠీ, హిందీ భాషల్లో సైన్స్కు సంబంధించిన అనేక కథలు, నవలలు, వ్యాసాలు రాశారు.