Salim A. Ali-Dr.

సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ (నవంబర్ 12, 1896 - జూలై 27, 1987) విఖ్యాత పక్షిశాస్త్రవేత్త, పద్మవిభూషణుడు, రాజ్యసభ సభ్యుడు సలీం అలీ. "Birdman of India" అని పిలువబడ్డాడు. భారతదేశంలో పక్షి శాస్త్రం (en:ornithology) గురించిన అవగాహన, అధ్యయనం పెంపొందించడానికి సలీం ఆలీ అనితరమైన కృషి చేసి గుర్తింపు పొందాడు.తన కుటుంబంలో సలీం ఆలీ 10వ బిడ్డ. తన పదవయేటనే తల్లిదండ్రులు మరణించడంతో అతని బంధువులు మామయ్య అమీరుద్దీన్ త్యాబ్జీ, మరొక ఆంటీ హమీదా బేగం అతని ఆలనా పాలన చూశారు. ఆలీ మరొక మామ అబ్బాస్ త్యాబ్జీ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని ప్రసిద్ధుడయ్యాడు. బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ (Bombay Natural History Society - BNHS) సెక్రటరీ వాల్టర్ శామ్యూల్ మిల్లార్డ్ సలీం ఆలీకి పక్షుల అధ్యయనం పట్ల ఆసక్తి కలగడానికి మొదటి స్ఫూర్తి.ముంబాయిలోను, బర్మాలోను సలీం ఆలీ విద్యాభ్యాసం సాగింది. జర్మనీలో బెర్లిన్ విశ్వవిద్యాలయం జూలాజికల్ మ్యూజియంలో పక్షుల అధ్యయనాన్ని గురించి మరింత వేర్చుకొన్నాడు. 1930లో ఇతను ప్రచురించిన పేపర్ ఇతనికి మంచి పేరు సంపాదించిపెట్టింది. హైదరాబాదు, కొచ్చిన్, గ్వాలియర్, తిరువాన్కూర్, ఇండోర్, భోపాల్ వంటి స్థానిక సంస్థానాధీశుల సహాయంతో ఆయా సంస్థానాలలో ఉన్న పక్షుల గురించి, వాటి సహజసిద్ధ నివాసస్థలాల గురించి వివరంగా అధ్యయనం సాగించాడు. ఈ కృషిలో దూరదూరాలలో ఉన్న ప్రాంతాలను సందర్శించాడు. ఈ కాలంలో అతని భార్య తెహమినా అతనికి తోడుగా ఉంది. 1939లో ఒక శస్త్రచికిత్స సమయంలో ఆమె మరణించింది. తరువాత అతని కృషికి అతని సోదరి, బావ తోడుగా నిలిచారు.200 సంవత్సరాల చరిత్ర గలిగిన బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ మూతపడకుండా కొనసాగడానికి సలీం ఆలీ ఎంతో ప్రయత్నించాడు. అప్పటి ప్రధాని నెహ్రూకు వ్రాసి ధన సహాయం పొందగలిగాడు. భరత్‌పూర్ పక్షి సంరక్షణ వనం, (Bharatpur Bird Sanctuary) సైలెంట్ వాలీ నేషనల్ పార్కు (Silent Valley National Park) పరిరక్షణ కోసం ఆలీ ఎంతో కృషి చేశాడు. 1990లో కోయంబత్తూరు వద్ద అనైకట్టిలో Salim Ali Centre for Ornithology & Natural History (SACON) ప్రారంభమైంది. ఇది భారత ప్రభుత్వం పర్యావరణ, వన విభాగాల అధ్వర్యంలో నడుస్తుంది.