Aryabhattu

ఆర్యభట్టు

ఆర్యభట్టు భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 476-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి పాట్నా) లో నివసించాడు. ఇతను ఆర్యభటీయం, ఆర్య సిధ్ధాంతం, గోళాధ్యాయం మరియు సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు పై విలువను సుమారుగా కనుకున్నట్లు చెప్తారు. గణితం లో మనం నేర్చుకున్న సైన్ మరియు కొసైన్ లను ఇతను "జ్యా" మరియు "కొజ్యా" గా నిర్వచించాడు.

భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు వస్తాయని, రాహు కేతువులు అనేవి నిజంగా లేవని వాదించాడు కానీ అతని వాదనని అప్పట్లో ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు కూడా కొంత మంది గ్రహణం సమయంలో భోజనం చెయ్యరు, గర్భిణి స్త్రీలని ఇంటి బయటికి రానివ్వరు. ఆర్య భట్ట బోధనలు గ్రీక్ శాస్త్రవేత్తలని కూడా ప్రభావితం చేసాయి. భూమి నీడ చంద్రుని మీద గోళాకారం(elliptical shape)లో పదుతుంది కనుక భూమి గుండ్రంగా ఉన్నట్టు గ్రీక్ శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఆర్య భట్ట సిధ్ధంతాల ఆధారంగానే. కానీ అప్పట్లో ప్రజలలో ఈ సిధ్ధాంతాలని నమ్మేంత జ్ఞానం వృధ్ధి చెందలేదు.

ప్రపంచంలో చాలా మంది ప్రముఖ గణిత శాస్త్రవేత్తల కష్టాలకు కారణమైన భూమి యొక్క ఆకారాన్ని గోళాకారంగా ఆనాడే తన గోళాధ్యాయం లో నిర్వచించాడు. అంతేకాదు మన గ్రహాల యొక్క ప్రకాశం స్వయంప్రకాశం కానే కాదని, అది కేవలం సూర్యకాంతి పరివర్తన వలన వచ్చినదని చెప్పాడు. సూర్య గ్రహణాల ను ఖచ్చితంగా లెక్క కట్టాడు.

భూమి తన చుట్టూ తాను తిరగటానికి (పరిభ్రమణం) పట్టే సమయం 23 గంటల, 56 నిమిషాల, 4.1 సెకనులు గా లెక్కగట్టాడు. ఈనాటి ఆధునిక లెక్కల ప్రకారం అది 23 గంటల, 56 నిమిషాల, 4.091 గా తేలింది.

భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు (ఆర్యభట) పెట్టారు.

ఆర్యభట్టు యొక్క జన్మ సంవత్సరం ఆర్యభట్టీయంలో స్పష్టంగా ఉదహరించబడింది కానీ ఈయన పుట్టిన ప్రదేశం యొక్క ఉనికి గురించి మాత్రం పండితులలో ఏకాభిప్రాయం లేదు. కొంతమంది పండితులు ఆర్యభట్టు నర్మాద, గోదావరి మధ్య ప్రాంతమైన అస్మకలో పుట్టాడని నమ్ముతారు. వీరి దృష్టిలో అస్మక మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ లో భాగమైన మధ్య భారతదేశం. తొలి బౌద్ధ గ్రంథాలు అస్మక మరింత దక్షిణాన ఉన్న దక్కన్ ప్రాంతమని వర్ణిస్తున్నాయి. అయితే ఇతర గ్రంథాలు అస్మక ప్రజలు అలెగ్జాండర్ పై పోరాడారని ప్రస్తావిస్తున్నవి. అదే నిజమైతే అస్మక మరింత ఉత్తరాన ఉండి ఉండాలి.