జగత్ కారణం ఏది ? అంటే "ఏకమేవ అద్వితీయం" అని చెప్పింది వేదం. ఎట్లా అయితే చెట్టు ఏర్పడటానికి గింజ కారణమో, ఈ ప్రపంచం అంతా ఏర్పడటానికి ఒక్కడే కారణం. జగత్ కారణం ఒక్కటేనా అంటే, ఒక్కడు అంటే వాడితో ఎప్పటికి వదలక వీడనివి కొన్ని ఉంటాయి, వాటినే విశిష్టములు అని అంటాం. తత్వం ఒక్కటే అన్నప్పుడు దానితో సహజమైనవి కొన్ని ఉంటాయి, వాటితో కూడుకున్న ఒక్కటి. ఇదే విశిష్ట అద్వైతం. దేనితో విశిష్టం ? పండు అనేది ఒక ఆకారం, ఒక రంగు, ఒక పరిమళం కలిగి ఉంటుంది. వీటిని వేరుగా విడదీసి చెప్పలేం. జగత్ కారణమైన పరమాత్మ ఒక్కడే, కానీ వేటితో కూడుకున్న వాడు అని ప్రశ్న వేస్తే, వేదానికి సారభూతం, శిరస్సు వంటిది పురుషసూక్తం. అది ఇస్తుంది వివరణ. "సహస్ర శీర్షా పురుషః" ఇదంతా తయారు చేసిన ఒకడు ఉన్నాడు, "హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ" ఆయన లక్ష్మీ ఇత్యాదులతో కూడి ఉండును అని చెబుతుంది. పరిమళాన్ని బట్టి పుష్పంని గుర్తించినట్లు, జగత్ కారణమైన వాడిని గుర్తించేది ఆయనలో వీడక ఉండే దయని బట్టి. ఆయనలో దయ ఎప్పటికీ ఉంటుంది. పరమాత్మలోని దయను వెలికితీసే అమ్మ లక్ష్మీదేవి గురించి తెలుసుకుందాం!!
![]() శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న రామానుజ జీయర్ స్వామి ప్రవచనం
|


